Sunday, 29 March 2015

రామాయణం

రామాయణం
శ్రీరామ చరిత్రం పరమ పవిత్రం , పాపాలను నశింపజేస్తుంది, పుణ్యం సమకూర్చి పెడుతుంది. ఇది వేదంతో సమానము. రామాయణ  గానం ఆయుర్ధాన్ని పెంపోదిస్తుంది. రామాయణం పఠించే వారు పుత్ర పౌత్రాదులతో. దాస దాసీ జనులతో స్వర్గ సుఖం అనుభవిస్తారు. మరణానంతరం దేవతలచే పూజింపబడుతారు.
రామాయణాన్ని బ్రాహ్మణులు పఠిస్తే అష్టాదశ విద్యలందు ప్రావీణ్యులవుతారు. క్షత్రియులు పఠిస్తే భూమండలాధిపతులౌతారు. వైశ్యులు పఠిస్తే అధిక సంపదలు పొందుతారు. శూద్రుడు పఠిస్తే గొప్ప వాడవుతాడు.
అటువంటి రామ రాజ్యంలో దుర్భిక్షం లేదు, వ్యాధులు లేవు, భయం లేదు, తండ్రి బ్రతికి వుండగా పుత్రులు మరణించే వారు కారు. స్త్రీలకు వైధవ్యము వుండేది కాదు. అగ్ని భయం లేదు, ఈతి భాధలు లేవు. ముసలితనం చే గాని, వ్యాధులచే గాని బాధలు ఉండేవి కావు. జనులు అందరూ సుఖ సంతోషములతో  జీవించే వారు.  దేశమంతా సుభిక్షమై ధన ధాన్యములతో సమవృద్ధిగా వుండేది.
ఇది కావ్యం, సీతమ్మ చరితం, సీతమ్మ నడయాడిన మహా కావ్యం. ఎందుకంటే రామా అంటే సీతమ్మ, ఆయనం అంటే నడచిన, నడయాడిన. ఇది జగన్మాత నడయాడిన చరిత్ర.
కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ....అని అన్నారు మహర్షి.  రామ కధను వాల్మీకి మహర్షి శ్లోక బద్ధం చేసి ఒక మహా కావ్యం గా మలచినారు. పుణ్యప్రదమైనది, మనోహర మైనది ఇది.  
నమః పరాయ దేవాయ పరాత్పరతరాయ చ ,
పరాత్పర నివాసాయ స గుణాయాగుణాయచ ,
 జ్ఞానా జ్ఞాన స్వరూపాయ ధర్మాధర్మ స్వరూపిణే,
విద్యాzవిద్యా స్వరూపాయ స్వ స్వరూపాయ తే నమః ||
విశ్వామిత్రుడు
మహారాజా, శూరుడు, సత్య పరాక్రమ వంతుడూ అయిన నీ కుమారున్ని రామున్ని నాతో పంపు, దుర్మార్గులైన ఆ రాక్షసులను వధించే సామర్ద్యం రామునికి మాత్రమే వుంది. రాముని శౌర్య పరాక్రమాల గూర్చి నీవు సందేహపడ వద్దు. నేను, వసిష్టుడు మరి ఇతర మహర్షులు మాత్రమే రాముని నిజ స్వరూపాన్ని ఎరుగుదుము. రాముని సామాన్య మానవునిగా తలచ వద్దు, నా పలుకులు విశ్వసించు అని విశ్వామిత్రుడు అంటాడు దశరధని తో.  నా యాగం ఆగిపోకుండా చూడు అని అంటాడు. ఇక్కడే ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. విశ్వామిత్రుడు ఒక ఋషి, ఒక తపస్వి. తాను చంప లేడా ఆ రాక్షసులను. ఒక శాపం ఇవ్వలేడా? ఇవ్వగలడు. చంపగలడు. అదే విషయాన్నీ దశరథునితో అంటాడు. “రాజా నేను వారిపై ఆగ్రహం చూపకూడదు. నేను తలపెట్టిన యాగం అటువంటిది. కాబట్టి శాపమియ్యరాదు.  శాపం అంటే ఏమిటి? శత్రువును నశింపజేసేది లేక అణగకొట్టే కర్మము. అదొక ప్రయోగము . ఆ ప్రయోగము ఆరు విధాలు. అందులో ఇది హరణ ప్రయోగము. ఉపాసకుడు దేవతను ఉపాసించి, తృప్తి పరచి ఆ దేవత ద్వారా ఆ శత్రువును నాశనం చేస్తాడు. దీన్నే హరణ ప్రయోగం అంటారు. ఈ ఒక్క హరణ ప్రయోగం వల్ల జీవితాంతం చేసిన తపః ఫలం నశించిపోతుంది. మళ్ళీ ఆ తపః ఫలం సమకూర్చు కోవాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి. అంతే కాకుండా ఈ హరణ ప్రయోగం రెండో సారి ప్రయోగించ కూడదు. ఆ దేవతయే అతన్ని ద్వేషిస్తుంది. శాంతి ప్రయోగం తప్ప ఉచ్చాటన స్తంభానాకర్షణ, విద్వేషణ, మారణములన్నీ మళ్ళీ మళ్ళీ ఇంకొకరిపై ప్రయోగిస్తే అతడికి హాని కలుగుతుంది. అందువల్లనే ఉపాసకులు ఇతరులు బాధించినప్పుడు సహించి ఒర్చుకొంటారు. తపస్సు కూడా ఒక ఉపాసనమే. అయితే కొద్దిపాటి వ్యత్యాసం వుంది. ఉపాసకుడు ఉపాసన చెయ్యగా చెయ్యగా అంతఃకరణం పవిత్రమై, శుద్దియై సర్వమూ ఆ దేవతగానే దర్శిస్తాడు. స్వార్ధం లేని వాడికి మాత్రమే మంత్రం ఇవ్వబడు తుంది, సిద్ధింప బడుతుంది. మంత్రోపాసనకు స్వార్ధం లేని వాడే ముందుకు వెళ్ళగలడు, పై మెట్లు ఎక్క గలడు. లేదంటే ఆ మంత్రము తన దగ్గర ఎంత మాత్రము నిలవదు. ఆ దేవత ఒక్క క్షణము నిలబడదు. మంత్ర దేవత ఉపాసన చేత ఉపాసకునికి కట్టుబడుతుంది. తన చుట్టూ తిరుగుతుంది. నీ భక్తి ప్రేమలను బట్టి నీతో వుంటుంది నీ చివరిదాకా. లేదంటే ఆమెకు ఇష్టం లేదంటే ఒక్క క్షణం ఉండదు నీ దగ్గర. మంత్రము అనేది ఒక శక్తి. శబ్ద శక్తి.....page....2
BHASKARANANDA NATHA….22/03/2015
----------------------------------------------------------------------------------------------------------------------------------
గురువు గొప్పా శిష్యుడు గొప్పా ? గురువే గొప్ప. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గొప్ప వారు, జ్ఞానులు. జ్ఞానులు ఎలా అయినారు? ఎన్నో జన్మలలో ఎంతో సాధన చేసి, ఇలా ఈ జన్మ తీసుకొని పునర్జన్మ లేని స్థితికి మోక్షానికి వెళ్ళినారు. వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి అలా చేసినారు అని అనుకొంటే పొరబాటే. వాళ్ళు సాధన చేత గొప్ప వాళ్ళు అయినారు. నీవు కూడా సాధన చేత ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక అన్నమయ్య కావచ్చు, ఒక రామదాసు కావచ్చు. సాధన , ఉపాసన వుండాలి. మార్గము చూపడానికి పాప కర్మలు తొలిగించడానికి మంచి గురువు వుండాలి. గురువు లేని విద్య రాణించదు. భగవంతుడి కైనా సరే గురువు వుండాలి. తప్పదు.
వశిష్టుడు దశరథుని తో ఇలా అంటున్నాడు.....” ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం పరః.... ఓ రాజా, ధర్మమే ఈ విశ్వామిత్రుడి రూపంలో కనిపిస్తున్నాడు. ఇతడు మహా వీరులలో శ్రేష్టుడు, బుద్దిమంతుడు, తపోనిధి, బ్రహ్మర్షి. కాబట్టి సందేహించకుండా రామున్ని ఇతని వెంట పంపు. ఇతడు నీ కుమారుడి చేత ఏయే కార్యాలు ధర్మమార్గం అనుసరించి చేయాలో, ఏయే కార్యాలు బుద్ధి బలం చేత చేయించాలో , ఏయే పనులు తపోబలం చేత సాధించాలో వాటిని అన్నింటినీ ఆయా పద్దతులద్వారా చేయించగల నేర్పరి. రాముడు అస్త్ర విద్యలు నేర్చినా, నేర్వక పోయినా విశ్వామిత్రుని రక్షణలో వున్నతవరకు అగ్నిచే రక్షింప బడిన అమృతం వలె రాక్షసులు ఇతన్ని ఏమే చేయలేరు అని వసిష్టుడు అన్నాడు. పరతత్వము తెలిసిన ఈ ముని రామున్ని రక్షిస్తూ వుంటాడు. అగ్ని జ్వాలలు అమృతాన్ని రక్షించినట్లు అంటే ఈ రాముడు అమృత స్వరూపుడు, ప్రకృతి ఆ తత్వాన్ని ఆవరించి వుంది. అంటే అమృతం అనబడే పర తత్వాన్ని ప్రకృతి ఆవరించి వున్నది, అనగా రాముడు మాయా మానుష విగ్రహుడని అర్ధం. ఈ విషయాన్ని భగతత్వాన్ని ఎరిగిన విశ్వామిత్రుడు కాపాడుతాడని   సారం.  నారాయణ మంత్రము ను ఉపాసించిన మహర్షులు ముక్తిని పొందుతారు, అదే మంత్రాన్ని రాజులూ ఉపాసించితే శత్రు సంహారం చేస్తారు. శ్రీరాముడు భగవంతుడే అయినా మానవరూపంలో వుండడటం వలన గురువు వల్ల మంత్రోప దేశం పొంది సకల శాస్త్రములను నేర్చుకొన్న వాడు అయినాడు. భగవంతుడైన మానవ రూపంలో అవతరించినప్పుడు గురువును ఆశ్రయించాలి. లోకం కూడా అతడి మార్గంలోనే అనుసరించాలి గదా. గురూపదేశం లేకుండా శిష్యుడు మంత్రాలూ నేర్చుకోకూడదు. ఒక వేళ దొంగతనంగా గ్రహించినా అవి ఫలించవు, ఫలించినా దుష్పలితాల్నే ఇస్తుంది. అందువల్లనే గురువును పూజించి , మెప్పించి ఆయన అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
శివే రుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టే ణ కశ్చన......మంత్ర సిద్దికి గురు భక్తియే మూలం, మంత్ర జపం కాదని గుర్తుంచుకోవాలి . అందువల్లనే ఈ ముని సకలాస్త్రవేత్త అని, ముల్లోకాలలో వుండే అస్త్రాలన్నీ ఎరిగిన వాడని వశిష్టుడు ప్రశంసించిచాడు. రాముడు భగవ౦తుడు అన్న విషయాన్నీ లోకులందరికీ ఈ ఉపదేశంలో తేట తెల్లమవుతుంది. రాముడే గురువు సేవచేసినప్పుడు ఇక మనమెంత అని లోకులుకు చెబుతున్నాడు.
అపూర్వాణాం చ జన నే శక్తో భూయస్స ధర్మ విత్ .....విశ్వామిత్రుడు ధర్మవేత్త, అంతే కాకుండా అనేక దివ్యాస్త్రాల్ని పుట్టించ గల సమర్ధుడు అంటే ఏమిటి అర్ధం? మహామంత్రాలు ఏడూ కోట్లని ప్రసిద్ది, ఎవరు ఎక్కువ కాలం ఏ అస్త్ర దేవతను ఉపాసిస్తాడో , అతడు ఆ దేవత అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అట్లా అనుగ్రహ పాత్రుడైన వాడిని ఋషి అంటారు. ఏ విధముగా మంత్రాన్ని ఉపాసిస్తే ఆ దేవత ప్రత్యక్షమవుతుందో , అదే దాని విధి. ఆ విధముగా పూర్వం అనేక మంత్రాలూ ఉపాసించి వాటి ప్రసాదానికి పాత్రుడై , ఆ మంత్రానికి తాను ఋషి అయ్యాడు. అందువల్ల ఇతడి మూలంగా శ్రీరాముడికి అస్త్రాలన్నీ లభిస్తాయి...అని వసిష్టముని దశరధునికు నచ్చ జెప్పి కొడుకు విషయంలో వుండే భయాన్ని వదలి వేయమని ఉపదేశించాడు. ఈ విశ్వామిత్రుడు తాను తలుచుకొంటే ఆ రాక్షసుల్ని కాల్చి బూడిద చేయగలడు, అంతటి వాడు తపస్సును మధ్యలో వదిలేసి రాముణ్ణి తనతో పంపమని నిన్ను యాచిస్తున్నాడంటే , అది నీ పుత్రునికి మేలు చేయటానికే వచ్చాడని తెలుసుకో,
గురూపదేశం లేనిదే ఎట్టి మంత్రం ఫలించదు, గురువు సర్వ విషయములు తెలిసిన వాడై వుండాలని , శిష్యుడు వినయంతో , భక్తితో గురు సేవలు చేస్తే గాని ఫలం లభించదు అని భోధిస్తుంది, గురువు అనుగ్రహానికి పాత్రుడైన శిష్యుడు ముల్లోకాల్లోనూ ఖ్యాతిని పొందుతాడు. ...page..2.(ఇంకావుంది)
శ్రిభాస్కరానందనాథ /23-03-2015
వశిష్ట మహర్షి ఉపదేశం పొందిన తరువాత దశరధుని లోని భ్రమలన్నీ తొలగిపోయినాయి. తానే వెళ్లి స్వయంగా రామలక్ష్మణులను  తీసుకొని వచ్చి విశ్వామిత్రుని ఎదుట నిలబెట్టినాడు. దశరధుడు ప్రేమాతిశయంతో రాముని శిరస్సు ముద్దాడాడు.
ఇక్కడ మనం గమనించ వలసిన విషయం ఒకటి వున్నది. దశరధునికి భ్రమలన్నీ తొలగిపోయినాయి. దశరధుడు అంటే ఈ జీవి, పది ఇంద్రియములతో ఉన్న జీవుడు, ఈ శరీరము ధరించిన జీవాత్మ. వీడు ఒకరాగాన లొంగడు. జీవుడుకి జ్ఞానము లబించాలంటే గురువులు రావాలి. అందుకని విశ్వామిత్రుడు గురు రూపంలో వచ్చినాడు. జ్ఞాన భోధ చేసినాడు. మాయను తొలగించి పరమాత్మ దర్శనం గావించినాడు.
సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయగ్౦ సహ, వినాశేన మృత్యుం తీర్త్వాసంభూత్యాzమృతమశ్నుతే ||
ఓ రాజా! రాముడు నీ కొడుకని అనుకొంటున్నావు, కానీ ఈ రాముడు అమృతుడు, అనగా ఉపనిషత్తు చే ప్రతిపాదించబడిన పరమాత్మ. అమృతానికి ఎక్కడైనా మృత్యు భయం వుంటుందా? అగ్ని జ్వాలలు అమృతాన్ని రక్షించినట్లు, ఈ రాముడే అమృత స్వరూపుడు. ప్రకృతి ఆ తత్వాన్ని ఆవరించి వున్నది....అని జీవుడు అనే దశరధునికి గురువు అనే విశ్వామిత్రుడు పరతత్వాన్ని గురించి ఉపదేశం చేసినాడు. మాయలో వున్న దశరధునికి జ్ఞాన భోధ చేసినాడు గురువు విశ్వామిత్రుడు. అప్పడు దశరధుడు (జీవుడు) రామలక్ష్మణులను పిలిచి ముద్దాడి పంపినాడు. అంటే రాముడు అంటే బుద్ధి, లక్ష్మణుడు అంటే మనస్సు. బుద్ధి, మనసు ఎప్పుడూ ఒకటిగా తోడుగా వుంటాయి, విడిచి వుండవు.  జీవుడు తనలోని బుద్దిని మనస్సును అప్పచేప్పినాడు. ముద్దాడి అంటే మనసును ఎప్పుడూ ముద్దాడాలి, కఠినంగా చెప్పకూడదు.
వినవె ఓ మనసా , వివరముగా తెల్పెదనే ...వినవె ఓ మనసా .....అని శ్రీ త్యాగరాజు అన్నారు.
మంచి శిష్యుడు కనిపించగానే మంత్రోపదేశం చేసి గురు పరంపరను వృద్ధి అయ్యేందుకు గురువు కృషి చేయాలి. అందువల్లనే ఆలస్యం చేయకుండా వచ్చి మంత్ర దీక్ష తీసుకోమని ఆదేశించినారు విశ్వామిత్రులు.
గృహాణ వత్స సఖిలం మా భూత్కాలస్య పర్యయః, మంత్రగ్రామం గృహాణ త్వం జరామతిబలాం తథా ||
మంత్రాన్ని చక్కగా ఉపాసించే శిష్యునికి ఉపదేశించి గురు పరంపర తెగిపోకుండా కాపాడాలి. అలా కాకుండా గురుపరంపరను తెగ కొట్టినట్లిైతే  పిశాత్వం వస్తుందని శాస్త్రం చెబుతుంది. పరోపకారానికి ఉపయోగించనిదే అది ఫలవంతం కాదు.
ఇక్కడ గురువు విశ్వామిత్రుడు రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి భగవత్సేవ చేసుకోవడానికి సిద్దపడినాడు. అంతే కాదు తపః ఫలాన్ని  అంతా లోకోపకారానికే వినియోగించాడు. ఇక శిష్యుడంటారా శ్రీరాముడు, పితృ వాక్య పరిపాలనకోసం రాజ్య భోగాలన్నింటిని వదలిన  త్యాగమూర్తి, ధర్మ మూర్తి.  అటువంటి శిష్యుడు దొరికినప్పుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంత్రోపదేశం చేయాలి. అదే చేసినాడు విశ్వామిత్రుడు.
శ్రి భాస్కరానందనాథ /24-03-2015
ఎవడి ఖర్మ వాడు అనుభవించక తప్పదు. తను చేసుకొన్న పాప ఖర్మే తన మృత్యువుగా వెంట బడి తరుముతుంది. ఎవడి తల వ్రాతను వాడే వ్రాసుకొంటాడు. హత్యలు చేసే వాడు మరొకడి చేతిలో హతుడు కాక తప్పదు అని మనకు రామాయణం చెబుతుంది.  కారణం లేకుండా మరో కారణం ఉత్పత్తి కాదు. రాక్షస సంహారం కోసమే రామావతారం వచ్చినది. వచ్చిన వాడు చంపక మానడు. రాక్షసులు హతులు కాక మానరు.  “రాజా నీ కుమారుని ముందు ఆ రాక్షసులు నిలబడలేరు. వాళ్ళను రాముడు తప్ప అన్యులు చంపలేరు. మానవ రూపంలో వచ్చినది మారీచ సుబాహులను చంపడానికే”....అని విశ్వామిత్రుడు దశరదునితో అంటున్నాడు. ఎవడు ఏ రకమైన క్రూర కర్మలు చేస్తారో వారి  ఆత్మ వినాశనాన్ని వారే కొని తెచ్చుకొంటారు. అనగా వారు కాల పాశానికి బద్దులు. దైవం నిమిత్తమాత్రుడు. వాళ్ళు చేసుకొన్న పాప కర్మ ఫలం చేతనే వారు మరణించబోతున్నారు. ఆ పని కాస్తా నీ కుమారుడి చేతుల మీదుగా జరగబోతున్నది. కాబట్టి సత్కర్మలు ఆచరించాలని చెబుతుంది రామాయణం.
రాముడు పరంధాముడు అని గ్రహించమని  విశ్వామిత్రుడు  ఎన్ని విధములుగా చెబుతున్నా దశరధుడు గ్రహించ లేకుండా వున్నాడు. ఎందువలన ? మహా మాయ.  వశిష్టుని వంటి తపోనిధులు తప్ప ఇతరులు తెలుసుకోలేరు. మహామాయ అనే మూల ప్రకృతిని ఉపాసిస్తే గాని భగవత్సేవకు పాత్రులు కాలేరు. అనగా ఏ రూపానికి పూజలు చేసినా ఆ రూపాలన్నీ ఆ ప్రకృతి శక్తివే కాబట్టి ఆమెకు చెందుతాయి. నిర్గుణ పరతత్వాన్ని బాహ్య పూజలు ద్వారా పూజించడం సాధ్యం కాదు. అందుకే ఉపాసన, ధ్యానం అని అన్నారు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణీ ఆ శక్తిలో నుంచి వచ్చినదే. ఆ తల్లి బిడ్డయే. అది దేవుడైనా, మానవుడైనా, ఋషి అయినా జ్ఞాని అయినా ఒక్కటే. ఆ మూల ప్రకృతిలో నుంచి వచ్చినదే, ఆమె గర్భంలో నుంచి వచ్చినదే. ఆ మహామాయకు, విష్ణు మాయకు లోబడి పని చేయాల్సినదే. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ, దశరధుని లో గూడుకట్టుకొన్న భావాన్ని తొలగించడానికి విశ్వామిత్రుడు శత విధములా ప్రయత్నం చేసుతున్నాడు.
అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం ....అని. ఎంతో కాలంగా మహాత్ములను, పెద్దలను సేవించి అహం నేను తెలుసుకొన్నాను. ఏమిటి రాముడు సత్య పరాక్రముడు అని. ఇది సత్యం నమ్ము అని. సద్గురువులను సేవించడం వలన నేను తెలుసుకొన్నాను అని అన్నాడు విశ్వామిత్రుడు. అంటే మనం కూడా ఈ సత్యమును తెలుసుకోవాలంటే సత్ పురుషులను సేవించాలి, అప్పుడే ఈ జ్ఞానం వస్తుంది అని. గురువులను సేవించకుండా సత్య జ్ఞానము తెలియదు అని. రాముడు మానవ మాత్రుడు కాదు అని తెలియాలి అంటే లౌకిక దృష్టి పోవాలి, జ్ఞాన దృష్టి రావాలి అది రావాలి అంటే జ్ఞానులను సేవించాలి అని మహర్షి విశ్వామిత్రుని ద్వారా తెలుస్తున్నది.
శ్రి భాస్కరానందనాథ /26-03-2015



Monday, 26 January 2015

సన్యాసి యోగము – పరిశీలన

సన్యాసి యోగము – పరిశీలన -2  
గురువు జీవ కారకుడు, రవి ఆత్మ కారకుడు, చంద్రుడు మనో కారకుడు, శని కర్మ కారకుడు, కేతువు  మోక్ష కారకుడు, వైరాగ్య కారకుడు.
జాతక చక్రములోని  ద్వాదశ రాశులలో దశమ స్థానము నకు మహా విశిష్టత కలదు. దీనిని రాజ్య స్థానమని, కర్మ స్థానమని, జీవన స్థానమని, సంకర్షణ స్థానమని పిలిచెదరు. ఈ భావమును బట్టియే జాతకుని, జీవుని యొక్క ఐహికాముష్మిక జీవిత విధానములు, స్థితి గతులు తెలియబడును. కావున ఈ రాశి యొక్క బలాబలములు అత్యవసరము. రాజ్య భావములు బలముగా లేకున్నచో మరి ఎన్ని రాజ యోగములు జాతకములో సూచింప బడిననూ, వాటిని జాతకుడు అనుభవించ లేడు. రాజ్య స్థానము, రాజ గ్రహము లైన రవి చంద్రులు ఉన్నతంగా లేనిచో జాతకుడు సామాన్య జీవితమును అనుభవించును. దీని ద్వారా జాతకుని యొక్క జీవనము, వైభవము, పరిపాలన, ఆచార వ్యవహారములు, పుణ్య నదీ స్నానము, దేవతా సిద్ధి, ఆస్తికత్వము, కీర్తి, గౌరవములు, సన్యాస యోగము, పీఠాధిపత్యము మొదలగునవి తెలియును.
౧. రాజ్యమున (10) నాలుగు గ్రహములున్ననూ లేక చూచిననూ జాతకుడు ఐహిక సబంధ విషయములను వదలి వేదాంత జ్ఞానమును పొంది సన్యాసి అగును. రాజ్యాధి పతి ఉచ్చ క్షేత్రముల యందు వున్న జాతకుడు సత్కీర్తి కలవాడు అగును. రాజ్యాధి పతి భాగ్యము నందు, భాగ్యాధిపతి బలీయుడై శుభ గ్రహ దృష్టి చెందగా, లగ్నాధి పతి బలముగా వున్న యెడల జాతకుడు మహా జ్ఞాని అగును. కేతువు సంయోగము ఉన్నచో మోక్ష జ్ఞానములు బడయును.
౨. రవి, బుధ, గురు, శుక్రులు కలిసి ఎక్కడ ఉన్ననూ, నైష్టిక బ్రహ్మచారియై కౌపీనాది దండములను ధరించును.
౩. లగ్న రాజ్యాధిపతులు మూడు గ్రహములతో కలసి ఎచ్చట ఉన్నానూ వేదాంత జ్ఞానము కల వాడుగాని, సన్యాసి కాని అగును.
౩. భాగ్య రాజ్యాధిపతులు, ఆయా స్వ క్షేత్రములలో గానీ , పంచామాధి పతి తో గాని సంబంధము యున్న యెడల చక్రవర్తి యోగము గలుగును.
౪. చంద్రునకు రాజ్యమున బుధ గురు శుక్రులున్న సన్యాసి గాని , వేదాంతి గాని, పీఠాధిపతి గాని అగును.
౫. లగ్న రాజ్యాధి పతులకు గురువుతో సంబంధము వున్న యెడల యజ్ఞాది క్రతువులు, గంగా స్నాన ఫలితము కలుగును. యజ్ఞాది సత్కర్మలు జేయును.
౬. రాజ్యమున రవి యుండి గురు సంబంధము కలిగినచో గంగాది పుణ్య నదుల స్నాన ఫలితము , యాత్రలు చేయును. శని సంపర్కము ఉన్నచో సన్యాసి , వేదాంతి అగును.
౭. చంద్రుడు బలవంతుడై రాజ్యమునందు , లగ్న రాజ్యములకు కేతు స్పర్శ, పంచామునకు శుభ గ్రహ దృష్టి ఉన్నచో ..జప తప యజ్ఞ యాగాదులు చెయు కర్మిష్టి అగును.
పంచమ కోణము (5) ఐహిక సంబంధమైన విషయములు తెలియజేయగా, భాగ్య కోణము (9) ఆముష్మిక సంబంధమైన విషయములను తెలియ జేయును. ఈ భాగ్య స్థానముకు పూర్వ జన్మ సంచిత స్థానమని కూడా పిలిచెదరు. దీనిని బట్టి జాతకుని యొక్క శుభ దుష్కర్మములు , ఐహికాముష్మిక కార్యములు, యజ్ఞ, దాన, తపో కార్యములు,తీర్ధ యాత్రలు, పుణ్య శ్రవణ, కీర్తనము, దేవ బ్రాహ్మణారాధన విషయములు తెలియనగును. మరణానంతరము పొందు లోకములను కూడా ఈ స్థితిని బట్టి తెలియనగును. జాతకుని యొక్క ఆచార వ్యవహారములు,చిత్త శుద్ది, స్వభావము, పరిశుభ్రత , వైభవము, గురు, పితృ, దైవ భక్తి , నదీ స్నానములు, దాన, ధర్మములు, దేవతా పూజార్చానము, తెలియనగును.
భాగ్య స్థానమును ధర్మ స్థానము అని ఐశ్వర్య స్థానమని , పూర్వ జన్మ సంచిత స్థానమని కూడా పిలిచెదరు.
వ్యయ భావము(12):-
ద్వాదశ భావములలో చివరి భావము వ్యయ భావము, దీనిని మోక్ష స్థానమని పిలిచెదరు. ఈ భావము వలన జీవి యొక్క మరణాంతర స్థితి తెలియనగును. జన్మ ఖర్చు, మిగులు, balance sheet, తెలుసుకోవచ్చును. 11, 12 స్థానములను బట్టి  లాభ, నష్టాల పట్టిక తెలుసుకోవచ్చును. కావున సన్యాస యోగము ను గురించి తెలుసుకోవలసిన స్థానములు లగ్నము, ద్వితీయము, పంచమ, సప్తమ, నవమ, రాజ్య, వ్యయ భావములను అందలి గ్రహములను క్షుణ్ణంగా పరిశీలించి చెప్ప వలయును. మాహారాజ యోగము కంటే పీఠాదిపతుల యొక్క యోగము చాలా గొప్పది. ఎందుకంటే ఆ మాహారాజులు వచ్చి సాష్టాంగ నమస్కారాములు చేస్తారు గనుక. అన్ని సుఖ యోగములను త్యజించి జ్ఞాన, వైరాగ్యములతో , పర బ్రహ్మ చింతనతో పీఠములను ఎక్కిన వారికి లోకిక బంధ చింతన ఉండదు, లౌకిక సుఖములు బాధించవు వారిని. వ్యయ స్థానమున శుభ గ్రహములు ఉన్నందువలన మిత వ్యయములు, సత్కార్యములకై ఖర్చు పెట్టుట జరుగును. పుణ్యాత్ములకు , సన్యాసులకు సర్వ కర్మ వ్యయం జరుగుతుంది , అంటే మోక్షం వస్తుంది. యోగులకు వ్యయాధి పతి బలంగా ఉండవలెను. అప్పుడే కర్మ నుంచి విముక్తి లబించును.
భాస్కరానంద నాథ /26-01-2015/srikalahasthi

సన్యాస యోగం....పరిశీలన – 1
మోక్ష కారకుడైన కేతువు, వ్యయాధిపతి బలంగా వుండి, సప్తమాధిపతి మరియు కళత్రకారకుడైన శుక్రుడు బలహీనంగా వుంటే సన్యాస యోగం వరించును. ద్వితీయంలో, నవమంలో, వ్యయంలో కేతువు వున్న మోక్ష యోగం. సప్తమంలో శని కూడా సన్యాస యోగాన్ని ఇస్తాడు. ద్వితీయ, సప్తం లో పాప గ్రహములు సన్యాస యోగాన్ని సూచిస్తాయి. మారక స్థానములైన ద్వితీయ, సప్తమములు సుఖములు ఇస్తాయి. సుఖములు ఏక్కువైతే, అతి సుఖములు దుఃఖాన్ని ఇస్తాయి. కామము, కోరికలు ధనము వలన, సుఖ స్థానమైన సప్తమం వలన కలుగుతాయి. అందుకే ఇవి మారక స్థానములు అయి వున్నవి. సన్యాసి జాతకములో ఈ రెండు స్థానములు చెడి వుండవలయును. బలహీనముగా వుండవలేను. వ్యయ స్థానము, వ్యయాధి పతి బలంగా వుంటూ, ఒకే రాశిలో నాలుగు కంటే ఏక్కువ గ్రహములు వుండవలయును. సుఖ స్థానములపై పాప గ్రహ దృష్టి కలిగి వుండ వలయును. గురువు, పంచమ స్థానాధిపతి బలంగా వుంటే వేదాధ్యయనము, సంస్కృతము, మంత్ర, తంత్ర శాస్త్రములతో మహా జ్ఞాని అగును. లాభాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి లాభ స్థితిగతుడైతే జ్ఞాన చక్రవర్తి, జగద్గురువులు అగుదురు. కర్మాధిపతి వ్యయం లో వున్నా కూడా మహా సన్యాస యోగం కలదు. సన్యాస యోగం, మోక్ష యోగం అనేది ఆధ్యాత్మికంగా గోప్ప రాజ యోగం. పెళ్లి కాని మాత్రాన సన్యాసి కాలేరు అందరూ. సన్యాసులు అందరూ పీఠాధిపతులు కాలేరు. పీఠాధిపత్యం అనేది గొప్ప మహా రాజ యోగం, జన్మరాహిత్య యోగం, చక్రవర్తి యోగం, విదేహ ముక్తి యోగం. సుఖాన్ని త్యాగం చేయగలవాడే విరాగి, సన్యాసి కాగలడు. ...
.భాస్కరానందనాథ


Thursday, 1 January 2015

తీర్ధ యాత్రా ఫలం ..

తీర్ధ యాత్రా ఫలం .........
ధార్మికులైన వారు కష్ట పడుతున్నారు, బాధ పడుతున్నారు, అధార్మికులు సుఖ పడుతున్నారు. పాపం చేసే వారు హాయిగా వున్నారు, పుణ్యాత్ములు కష్ట పడుతున్నారు. మంచితనానికి మనుగడ లేదా ? దేవుడు వున్నాడా అని మనలో చాలా మంది అడుగుతూ వుంటారు.  ఇదిగో సరిగ్గా ఇదే ప్రశ్నను మహాభారతములో ధర్మ రాజు అడిగినాడు రోమశ మహర్షిని. ఈ ధర్మ సందేహం బడబాగ్ని వలె ధర్మ రాజును బాధిస్తూ వుండేది.
పుణ్య చరితులైన పాండవులు అడవుల పాలైనారు, ఇదేమి న్యాయం అని మనకు అనిపిస్తూ వుంటుంది.
ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షంగా చెప్పిన వారు ఇద్దరు, ౧, రోమశుడు ౨. మార్కండేయుడు . పరోక్షంగా చెప్పిన వారు మరొక ఇద్దరు ..౧. వేద వ్యాసుడు, ౨. ధౌమ్యుడు.
ధర్మ రాజు వెంట వేద విప్రులు కూడా వున్నారు. హితమును కోరే వేద బ్రాహ్మణులను వెంట పెట్టుకోవాలి అనేది ఇది మనకు చెబుతుంది. ధర్మ విషయాన్ని చెప్పే బ్రాహ్మణులు మన వెంట వుండాలి. పదిమంది హితమును కోరే వేద విప్రులు మనకు ధర్మ సూక్ష్మములను చెప్పి దిశానిర్దేశం చేస్తారు. అందుకు కావాలి బ్రాహ్మణులు సమాజమునకు.
తీర్ధ యాత్రల పట్ల ఆసక్తితో మొదట నారదుడి వలన తీర్ధాల పేర్లు, మహిమలు తెలుసుకొన్నాడు. ధౌమ్యుడి వలన ప్రేరితుడై తీర్ధయాత్రలు చేయాలని సంకల్పించినాడు. రోమశ మహర్షి వలన వివిధ తీర్ధ మహత్వ గాధలను అడిగి చెప్పించుకొని, తరించినాడు. తీర్ధాలలో మునిగి దివ్య దృష్టిని, దూర శ్రవణ శక్తిని పొంది, దివ్య లోకాలను దర్శించినాడు. తపస్సు వలన దివ్య లోక గమన శక్తిని అర్జునుడు సాధిస్తే, ధర్మజుడు కర్మ మార్గములో తీర్ధ సేవా పుణ్య ఫలంగా సంపాదించ గలిగాడు. చాలా మంది అడుగుతూ వుంటారు తీర్ధ యాత్రల వలన ఏమి లాభం అని? దేవుడు ఎక్కడ లేడు, కాశీలోనే వున్నాడా ? ఇక్కడ లేడా? డబ్బులు దండగ అని. అటువంటి వారికి ఇది సమాధానం. భారతీయ గార్హస్థ్య ధర్మంలో, కర్మ పద్ధతిలో తీర్ధ యాత్రా వ్రతాన్ని పెద్దలను అడిగి తెలుసుకొని, ఆచరించి, తత్ఫలితాన్ని సంపూర్ణముగా సాధించిన ఏకైక మహాత్ముడు ధర్మరాజు.
అటువంటి ధర్మ రాజు అడిగాడు...... “ ధరణి నధార్మికులగు కా పురుషుల కభివర్ధనంబు బుణ్య చరిత్రం బరఁగెడు ధార్మికులకు దుర్ధరమగు నవివర్ధనంబుఁ దగునే మునీంద్రా ! “.......
దానికి రోమశ మహర్షి ఇలా చెప్పినాడు.....
అధర్మ పరులు అభ్యుదయాన్ని సాధించినా అది ఎక్కువ కాలం నిలువదు, త్వరలో నశించిపోతుంది. ఇతరులను బాధించి సంపాదించి ధనము తో భాగ్యములను అనుభవించినారు, కానీ ...అది కల కాలం నిలువదు. ధర్మ వర్తనులు, ధర్మాన్ని నమ్ముకొన్న వాళ్ళు తాత్కాలికంగా సౌఖ్యాలకు దూరమైనా, త్వరలోనే తమ స్వీయ ధర్మ శక్తితో విజయాలను సాధిస్తారు. తాము కోల్పోయిన దానిని తిరిగి పొందుతారు. ...అని
అయినా ఈ సమాధానంతో తృప్తి పడలేదు ధర్మ రాజు. అందుకే తిరిగి ఇదే ప్రశ్నను మార్కండేయ మహర్షిని అడిగినాడు. 
దానికి మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు....” అత్యుత్కటైః పుణ్య పాపైః ఇహైవ ఫలమశ్నుతే”.....అన్నదాని ప్రకారం కౌరవుల పాపం పండి, త్వరలోనే  రాజ్య భ్రష్టులౌతారు. పాండవులు తిరిగి రాజ్య పదవిని  పొందుతారు. ఈ లోకంలో సంపదలు గడించి, పుణ్య మార్గమున పోవక, లోభ మోహితులై ఇంద్రియ భోగము లకు లోనై జీవించే వారికి,  ఇహం లో సుఖము వున్నా, పరం లో మిగిలేది దుఖమే. పుణ్య కర్మలు చేసిన వారు ఇహ లోకంలో దుఃఖం పొందినా, పర లోకంలో సుఖిస్తారు. ధర్మాన్ని ఆచరిస్తూ సత్కర్మలు, సత్ర్కతువులు చేసే వారు ఇహ పర సుఖము లను రెంటినీ అనుభవిస్తారు. పాండవులు ధర్మశీలురు, పుణ్యవ్రతులు కావటం చేత శత్రువులను జయించి రాజ్యాన్ని పాలించి కీర్తిని గడించుతారు అని చెప్పాడు మార్కేండేయ మహర్షి.
తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా ధర్మాత్ములు చివరికి గెలుస్తారు, శాశ్వత కీర్తిని పొందుతారు, ధర్మం గెలుస్తుంది. భగవంతుణ్ణి నమ్మి బ్రతుకుదాము.
.....మీ భాస్కరానంద నాథ

Thursday, 20 November 2014

వివాహములు – ప్రేమ వివాహములు – పునర్వివాహములు - 1

వివాహములు – ప్రేమ వివాహములు – పునర్వివాహములు - 1

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం".
పుత్రతే క్రియతే భార్యా”.... వివాహము పుత్ర సంతానము కొరకు. వంశము నిలపడానికి వివాహము అని అన్నారు.  
వివాహము సంతానము కొరకే గాని, భోగము కొరకు మాత్రము కాదు అని మన ఆర్ష ధర్మము చెబుతున్నది.
“వివాహో ప్రజాయై, నతు భోగాయేతి  మహాత్మనో మతం”....అని సిద్ధాంతం. పున్నామ నరకము నుండి ఉద్దరింపు వాడు గాన పుత్రుడు అని అన్నారు. అటువంటి పుత్రుని కోసం వివాహం.
జీవితంలో వివాహం అత్యంత ప్రధాన విషయం. ఏ వయసులో వివాహం, ఎప్పుడు జరుగుతుంది ? సుఖ ప్రదంగా ఉంటుందా? అన్యోన్యత ఉంటుందా? అనురాగం ఉంటుందా? సంతానం ఉంటుందా? ఎడబాటు వుంటే ఎన్నాళ్ళు సాగుతుంది ? ఎప్పటికైనా ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం ఉందా? లేక విడాకుల వరకు వెలుతుందా?
వివాహము ఎక్కడ? ఎవరితో దగ్గర సంబంధమా? దూర సంబంధమా? సాంప్రదాయ వివాహమా? ప్రేమ వివాహమా? ప్రేమ ఫలిస్తుందా? మోసగింప బడతారా? విడాకులు వస్తాయా ? పునర్వివాహమా ? అది ఫలిస్తుందా?
ఇటువంటి అనేక ఆసక్తికర విషయములు జ్యోతిష శాస్త్ర సమన్వయముతో చక్కగా తెలుసుకొని తగు జాగ్రత్తలు మంచి జ్యోతిష్కుని ద్వారా తెలుసుకోవచ్చును.
ఇందులో ప్రేమ వివాహములు జరిపించేది, మనసును చెడ గొట్టేది పాప గ్రహములు, అందులో ముఖ్యముగా ప్రధాన పాత్ర పోషించేది రాహు. రాహు కేతు గ్రహములు ఛాయా గ్రహములు అయిననూ కళత్ర భావము పై చాలా ప్రభావము చూపి పతనావస్థకు చేర్చుతాడు. అవమాన పాలు చేస్తాడు. మూడు నాలుగు వివాహములు చేస్తాడు, నమ్మించి మోసం చేస్తాడు, వర్ణాంతర, కులాంతర వివాహములు చేయిపిస్తాడు, నీచ స్త్రీలతో సహవాసం చేయిపిస్తాడు.

 భార్య వుండగా, భర్త వుండగా అక్రమ సంబంధములను కలిపిస్తాడు, పర స్త్రీల యందు ఆరాటం, ఆసక్తి, వంచించడం, నైతిక విలువలు పాటించక పోవడం, యజమాని భార్యను, గురు పత్నిని వాంచించడం, స్త్రీ విషయం లో నియమాలకు తిలోదకాలు ఇవ్వడం, అడ్డు వచ్చిన వారిని బెదించడం, చంపడం, భార్య వుండగా వంట మనిషితో, పని మనిషితో సంబంధాలు, వెధవ చేష్టలు చేయడం, భార్యను అమానుషంగా హింసించడం, అతి క్రూరంగా, శాడిస్టు లాగ ప్రవర్తించడం, భార్యను కాల్చుకొని తినడం లాంటివి చేస్తాడు.  ఆత్మహత్యలకు పాల్పడుతారు,  భార్యలైతే భర్తలను ఏడిపించుకొని తిని, బజారుకు ఈడుస్తారు.   

క్షుద్ర మాయా మంత్రములను ఉపాసించడం, ప్రయోగించడం, కుట్ర కుతంత్రములకు తావివ్వడం ఇలాంటి పనులకు రాహువు కారణం. అదే రాహువు మంచి స్థానములలో వుంటే వైద్య వృత్తి లో బాగా రాణిస్తారు.
మిగతా విషయములు రేపు తెలుసుకొంటాము. స్వస్తి.
మీ
భాస్కరానందనాథ

20-11-2014

Sunday, 14 September 2014

గరుడ పురాణం – భగవంతుడి శిక్షాస్మృతి
మానవునికి శాశ్వతమైన శ్రేయస్సును, దానికి మార్గమును తెల్పు గ్రంథములు వేదములు. అవి అపౌరుషేయములు, వాటి అర్ధములను అందు ప్రతిపాదింపబడిన ధర్మములను సులభముగా తెలుసుకోనుటకై ఇతిహాస పురాణములు వెలువడినవి. ఆ పురాణములను ప్రతి ఒక్కరూ తప్పక చదివి ధర్మాధర్మములను, పాప పుణ్యములను  తెలుసు కొనవలయును. శాస్త్రము ననుసరించి మానవుడు నడుచుకోనవలెను. ఆ శాస్త్రమును గురించి చెప్పు వాడ్ని శాస్త్రి అని అందురు.
అష్టాదశ పురాణములలో ఒకటి గరుడ పురాణము.  ఈ గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు చేత గరుత్మంతునికి ఉపదేశింపబడినది. విష్ణు ఆరాధన, తులసీ మహాత్మ్యము, ఏకాదశి వ్రత విధి, నామ మహిమ, సదాచార విధానము మొదలగు పెక్కు విషయములు ఇందు చెప్ప బడినవి.
గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ... ఆసక్తిగా గరుడపురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఏదో చెప్పనలవి కాని భయము, అపోహ. మరణించినప్పుడు మాత్రమే చదువ వలెను అని, ఇతర రోజులలో చదువకూడదు అని అపోహ, అశుభం అని కొందరి భయము. ఇది తప్పు. ప్రతి ఒక్కరూ చదువ వచ్చును. తల్లిదండ్రులు వున్నవారు మాత్రము ఇందులోని అంత్యేష్టి విధానము చదువ కూడదు. మిగతా అన్ని విషయములు చదువ వచ్చును, తప్పక చదివి తెలుసుకోవలయును. ఈ పురాణము అందరి ఇండ్లల్లో ఉండవచ్చును. గరుడ పురాణమును అందరూ నిరభ్యంతరముగా చదువ వచ్చును అని శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు చెప్పి యున్నారు. ఈ పురాణమును బ్రాహ్మణులకు దానము చేయుట చాలా విశేషము.
ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.  జీవుడి ప్రయాణం, జీవుడి కర్మ, పాప పుణ్యములు, యాతనా శరీరం, యమపురి, చావు పుట్టుకలు, అంత్యేష్టి విధానము, పునర్జన్మ, రోగములు, వ్యాధులు, దానములు ఇవన్నీ తేటతెల్లముగా చెప్పబడినవి. జీవుడు ఉత్తమ జన్మలు పొందాలంటే ఏమి చేయాలి, కర్మ, జన్మ, పాపము, పుణ్యము, రోగాలు, ప్రమాదాలు ఇలా ఎన్నో ఆశక్తి కరమైన విషయములు తెలుసుకో వచ్చును. తల్లి దండ్రులు వున్న వారు ప్రేత కల్పం తప్పించి మిగతా అన్ని విషయములు, అన్ని అధ్యాయములు  అందరూ చదువ వచ్చును.
 మీ
భాస్కరానంద నాథ /14-09-2014/SRI KALAHASTHI.  

Thursday, 11 September 2014

అనాయాస మరణము – ఆయాస మరణము

అనాయాస మరణము – ఆయాస మరణము

మంత్రేశ్వర ఫలదీపికాయాం – చతుర్ధశోz ధ్యాయే – శ్లోకం -21 

సౌమ్యాంశకే సౌమ్య గృహేzధ సౌమ్య సంబంధ గే వా క్షయ భేక్షయేశే
అక్లేశ జాతం మరణం నరాణాం వ్యస్తే తధా క్రూర మృతిం వదంతి.

అను ప్రమాణము వల్ల క్షయ భావము గానీ, క్షయాధిపతి గానీ సౌమ్యులయిన పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహముల సంయోగ విలోక నాధులు పొందినప్పుడు గానీ, క్షయ స్థానమున వున్నప్పుడు గానీ సునాయాస మరణము మానవులకు కలుగును.
మోక్ష స్థానమున యుక్తులుగా శుభులు యున్న ముక్తియు కలుగును. ముక్తి యందు పాపులున్నను ముక్తి విహీనుండు యిలలో ముదముగ రామా ||
ఈ విధముగా క్షయ భావ మనగా పన్నెండవ యిల్లు, ఇదియే మోక్ష స్థానము, వ్యయ స్థానము రెండునూ. ఇట్టి వ్యయాధిపతి పాపుడాయి శుభ సంయోగ విలోక నాధులు లేనప్పుడు ప్రబల పాప సంయోగ విలోకనాదులు పొందినప్పుడు దీర్ఘ కాల రోగ మరణములు, ఆయాస మరణములు, సమూహ మరణములు, అగ్ని మరణములు, జల మరణములు, ప్రబల శత్రువుల చే చిత్రవధతో కూడిన పలు విధములగు దుర్మరణములు  పాపులకు సంభవించును వారి వారి పూర్వ కర్మాను సారముగాను.
కనీసము వ్యయాధి పతి, అంశయందైనను శుభ క్షేత్ర, శుభ సంయోగములను పొందిన గాని అనాయాస మరణము కలుగదు. ప్రబల పాప స్థితి సంయోగ విలోక నాధుల చేత రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు, ఓడ ప్రమాదములు, కారు, సైకిలు ప్రమాదములు, బండ్ల ప్రమాదములు కలుగును.
జాతక చక్రము లోని దోషములను తెలుసుకొని, ఆయా గ్రహములకు శాంతి చేయించుకొని, ఇష్ట దేవతారాధన మరియు గురువును ప్రార్ధించ వలయును. గురువు ఒక్కడే అన్ని ప్రమాదముల నుంచి కాపాడ గలడు.


మీ 
శ్రీ భాస్కరానంద నాథ /12-09-2014

Sunday, 24 August 2014

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం
పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే గ్రహాల రూపములో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము. ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో  లేదా రోగాల రూపం లోనో వచ్చి మనల్ని బాధ పెడుతుంటాయి.

మరి పాపం అంటే ఏమిటి? చెడు కర్మ, చెడు పని పాపం అన్నారు. మరి చెడు పని అంటే? శాస్త్ర వచనమునకు తద్భిన్న మైనది, విరుద్ధ మైనది. అంటే ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడం. ఉదాహరణకు:- ఒకర్ని తిట్టినాము, కొట్టినాము, అనరాని మాటలు అన్నాము, ఒక ప్రాణిని హింసించినాము. ఎదుటి వారిని బాధ పెట్టినాము, అన్యాయంగా ప్రవర్తించినాము, ఇతరులను మోసం చేయుట, దొంగతనము, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చును.

శ్లో||  నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||

అనగా అనుభవించనిచో కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ దాని ఫలమును మనము తప్పక అనుభవింపవలసినదే అని అర్ధము.
అందుకని పరమాత్ముడి కైననూ తిప్పలు తప్పవు అని అనడంలో అర్ధం ఏమిటంటే ఎంతటి వాడికైనా జన్మ తీసుకొంటే కర్మ అనుభవించ వలసినదే అని అర్ధము. ఇక్కడ పరమాత్మ అంటే పరమాత్మ అని అర్ధము కాదు. కోటీశ్వరుడి కైనా క్షుద్భాధ తప్పదు అని అంటే. కోటీశ్వరుడు అని అర్ధము ఎంతటి వాడి కైనా ఆకలి బాధ తప్పదు అని అర్ధములో కోటీశ్వరుడు అని వాడుతాము. నా భార్య బంగారం అంటే MY WIFE IS GOLD  అని కాదు అర్ధము నా భార్య చాలా మంచిది అని అర్ధము. ఒక పదాన్ని ఏ సందర్భంలో వాడినామో తెలుసుకోకుండా, పరమాత్మకు జన్మ లేదు, ఆయనకు తిప్పలు లేవు, పరమార్ధం తెలుసుకోవాలి అని దురుసుగా పెద్దా చిన్నా లేకుండా మాటలాడ కూడదు. అదే పాపం అనేది.

 పెద్దలను, ఇతరులను నోటికి ఇష్టం వచ్చినట్లు అహంకారంతో మాటలు అంటే వాళ్ళు ఎంత నోచ్చుకొంటారో అనేది తెలియక పోతే, కనీసం ఆ తరువాత అయినా పశ్చాతాపం తో క్షమాపణలు చెప్పక పోతే ఎవరికి నష్టం. నోటి దురుసు తనమునకు జన్మ జన్మలు బాధ పడవలసి వస్తుంది. అసలు పరమాత్మ తత్త్వం ఎందులో కనిపించదు. సమస్త జీవ రాశిలో వున్నది ఆ పరతత్వం, పరమాత్మ తత్త్వం చూచే కన్నులు వుంటే. ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నారో నాకు అర్ధం కాదు. విడిగా ఎక్కడన్నా కూర్చోని ఉంటాడా ఆ పరమాత్ముడు? ఆయనకు పేరు, రూపం, స్థితి, గుణం ఏవీ లేవు. అంతటా నిండి నిభిడీకృతమై వున్నాడు. ఎవర్ని అవును అంటావు? ఎవర్ని కాదు అంటావు? ప్రతి కణంలో వున్నాడు పరమాత్మ. ఆయన లేని చోటు లేదు. నీలో, నాలో అందరిలో వున్నాడు. మనం అజ్ఞానం లో వుండి చూడ లేకున్నాము, గుర్తించ లేకున్నాము. ఆ విశ్వకర్త అన్ని రూపాలలో వున్నాడు. ఆఖరాకి ప్రతి గాలి, ధూళి కణంలో కూడా వున్నాడు. ఆయన్ను గుర్తించ లేని అంధులము మనము. గిరి గీసుకొని బ్రతుకు తున్నాము.

తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. ఒకరి పట్ల మనము ఏదన్నా తప్పు చేసిన యెడల వెంటనే వారిని మనము క్షమాపణలు అడగాలి, లేదంటే అది జన్మ జన్మలు మనల్ని వెంట తరుముతూనే వుంటుంది. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా వదలి పెట్టదు. మనము చేసిన తప్పులు వలన మన పిల్లలు అనుభవించాలి. తాతలు, ముత్తాతలు చేసిన తప్పులు ఆ వంశంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతూ వుంటాయి. కొందరి జాతకములు పరిశీలించి నప్పడు ఇలాంటివి బయట పడుతూ వుంటాయి. ముఖ్యముగా సర్ప దోషములు, రాహు కేతు దోషములు. కొడుక్కు వుంటుంది, కూతురుకి వుంటుంది, భార్యకు, భర్తకు, తల్లికి, తండ్రికి, తాతకు అందరికీ అందరికీ ఒకే విధముగా వుంటుంది. ఎందువలన? ఎవరో, ఎప్పుడో ఎక్కడో చేసిన చిన్న తప్పు, తరతరాలు వెంటాడుతూ వస్తుంది. ఇలాంటివే కాల సర్ప దోషములు కూడా. అల్లాడి పోతూ వుంటారు. ఎందుకని పాపం. అహంకారముతో చేసిన ఒక పని పాపం గా మారినది.

చేసిన చిన్న తప్పు మహా పాపం గా మారకుండా ఉండాలంటే ఏమి చేయాలి? నీ కుటుంబాన్ని వేధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

ప్రాయశ్చిత్తై రపైత్యేనః....... ప్రాయశ్చిత్తముతో పాపములు తొలగి పోవును.

పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకొంటే తప్పక పాపం పోవును అని శాస్త్రం చెప్పినది. పరాశర స్మృతి చెప్పినది.

శ్లో|| ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే, తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే.||

ప్రాయాస్ అనగా తపస్సు. చిత్తము అనగా నిశ్చయము. నిశ్చయముతో కూడిన తపస్సు చేయడమే ప్రాయశ్చిత్తం అని అన్నారు. అంటే నీకై నీవు దండన విధించుకోవడం. లేదా మీ గురువుల దగ్గరకు వెళ్లి, పెద్దల దగ్గరకు వెళ్లి “ అయ్యా, నేను ఫలానా తప్పు చేసినాను, నా తప్పు పోవాలంటే ఏమి చేయాలో శెలవు ఇవ్వండి” అని విధేయతతో అడగాలి. గురువులు చెప్పిన విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ఆలస్యముగా లేచినావు, ఆలస్యముగా అర్ఘ్యం ఇచ్చావు. ప్రాయశ్చిత్తం చేసుకో. మూడు సార్లు ఇచ్చేది నాలుగు సార్లు చెయ్యి. అనుష్టానం లో లోపం జరిగినది, ఇంకో 108 గాయత్రి అధనముగా చెయ్యి.  అన్నదానం చేయాలి, ఆర్ధిక స్థోమత లేని వాడివి, ఇంకో పదివేలు మూల మంత్రం జపం చెయ్యి. ప్రతి దానికి, ప్రతి మంత్రానికి, ప్రతి కార్యానికి, ప్రతి తప్పుకు శాస్త్రములో ప్రాయశ్చిత్తం చెప్పబడి వున్నది. అది తెలుసుకో నీ గురువులను అడిగి. మీ ఇంటి పురోహితుడ్ని అడుగు చెబుతాడు. వెంటనే చెయ్యి.
ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించినావు, వెంటనే “అయ్యా, పొరబాటు అయినది, నన్ను క్షమించండి అని అడుగు.
క్షమించమని అడగ కుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకొంటాను అంటే కుదరదు. పాపం పోదు. ఎవరి పట్ల మనము అగౌరవముగా ప్రవర్తించినామో, వారిని క్షమాపణలు అడిగి తీరాలి. అప్పుడే మనము చేసిన పాపం పోతుంది.

ఒక వేళ క్షమాపణలు అడగ లేని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించలేదు, లేదా ఏదన్నా ప్రాణిని తెలిసో, తెలియకో హింస పెట్టినావు, లేదా చూసుకోకుండా చంపినావు, అప్పుడు మాత్రమే మీ గురువులను అడిగి ప్రాయశ్చిత్తం తెలుసుకొని చేయాలి.
పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం గాని, లేక క్షమాపణలు గాని ఎటువంటి పాపము నైననూ కడిగి వేస్తుంది.
సులభమైనది మనస్పూర్తిగా క్షమాపణలు అడగడం.
గురువులు, పెద్దలు లేనప్పుడు, వీలు కానప్పుడు నీకై నీవు ప్రాయశ్చిత్తం విధించుకోవచ్చును. నీ సుఖాన్ని నీవు త్యాగం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. ఒక రోజు భోజనం మానేయడం, పది రోజులు ఉపవాసం వుండడం, లేదా మౌన వ్రతాన్ని పాటించడం, నేలపై పరుండడం, ఇలా....

దోషములు పోగొట్టుకొనుటకు ప్రాయశ్చిత్తములున్నవి, అంతే గాని దోషములు చేయుటకు కాదు.

ప్రాయశ్చిత్తం చెప్పబడినది కదా అని పాపములు చేయకూడదు. దానికి నిష్కృతి లేదు. అలాగే పశ్చాతాపం లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకున్నా అది కూడా వ్యర్ధమే. పాపము పోదు.

శ్లో|| ప్రాయశ్చిత్త మకుర్వాణాః పాపేషు నిరతా నరాః, అపశ్చాత్తాపినః కష్టాన్నరకాన్ యాంతి దారుణాన్ ||

పశ్చాతాపంను మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు చెప్పుదురు. ఇది వీలుకాని పరిస్థితులలో మాత్రమే చేయ వలెను.   చేసిన తప్పుకు క్షమాపణలు అడగడమే ఉత్తమోత్తం. దానిని మించినది లేదు.

ప్రాయశ్చిత్తము వలన దోష నిర్మూలన తప్పక జరుగును, అయితే బుద్ధి పూర్వకముగా చేసిన యెడల పాపము పోదు అని చెప్ప బడినది.
శ్లో|| కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్ ||

బుద్ధి పూర్వకముగా చేసినది, కోరక చేసినది అని పాపములు రెండు విధములు. తెలియక చేసిన పాపములు, తెలిసి కావాలని చేసిన పాపములు. తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అగును. కానీ పొగరుతో, తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు  ప్రాయశ్చిత్తముతో పోవు  అని తెలియవలెను.

ఒకరు చేసిన పాపములు (పూర్వజన్మ) వారి జాతక రీత్యా తెలుసుకొనవచ్చును. ఒకరి పాపములను ఇంకొకరు తీసుకొని అనుభవించ వచ్చును. తమ పుణ్యమును ఇతరులకు ధార పోయ వచ్చును. మంత్ర శాస్త్రములో ఇది వీలు అగును. మహా గురువులు తమ శిష్యుల యొక్క భక్తుల యొక్క పాపములు తాము తీసుకొని అనుభ వించిన సందర్భములు ఎన్నో కలవు. మరొక మారు ఈ విషయము పై తెలుసు కొనెదము.

మీ
భాస్కరానంద నాధ/24-08-2014.