Sunday 14 September 2014

గరుడ పురాణం – భగవంతుడి శిక్షాస్మృతి
మానవునికి శాశ్వతమైన శ్రేయస్సును, దానికి మార్గమును తెల్పు గ్రంథములు వేదములు. అవి అపౌరుషేయములు, వాటి అర్ధములను అందు ప్రతిపాదింపబడిన ధర్మములను సులభముగా తెలుసుకోనుటకై ఇతిహాస పురాణములు వెలువడినవి. ఆ పురాణములను ప్రతి ఒక్కరూ తప్పక చదివి ధర్మాధర్మములను, పాప పుణ్యములను  తెలుసు కొనవలయును. శాస్త్రము ననుసరించి మానవుడు నడుచుకోనవలెను. ఆ శాస్త్రమును గురించి చెప్పు వాడ్ని శాస్త్రి అని అందురు.
అష్టాదశ పురాణములలో ఒకటి గరుడ పురాణము.  ఈ గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు చేత గరుత్మంతునికి ఉపదేశింపబడినది. విష్ణు ఆరాధన, తులసీ మహాత్మ్యము, ఏకాదశి వ్రత విధి, నామ మహిమ, సదాచార విధానము మొదలగు పెక్కు విషయములు ఇందు చెప్ప బడినవి.
గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ... ఆసక్తిగా గరుడపురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఏదో చెప్పనలవి కాని భయము, అపోహ. మరణించినప్పుడు మాత్రమే చదువ వలెను అని, ఇతర రోజులలో చదువకూడదు అని అపోహ, అశుభం అని కొందరి భయము. ఇది తప్పు. ప్రతి ఒక్కరూ చదువ వచ్చును. తల్లిదండ్రులు వున్నవారు మాత్రము ఇందులోని అంత్యేష్టి విధానము చదువ కూడదు. మిగతా అన్ని విషయములు చదువ వచ్చును, తప్పక చదివి తెలుసుకోవలయును. ఈ పురాణము అందరి ఇండ్లల్లో ఉండవచ్చును. గరుడ పురాణమును అందరూ నిరభ్యంతరముగా చదువ వచ్చును అని శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు చెప్పి యున్నారు. ఈ పురాణమును బ్రాహ్మణులకు దానము చేయుట చాలా విశేషము.
ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.  జీవుడి ప్రయాణం, జీవుడి కర్మ, పాప పుణ్యములు, యాతనా శరీరం, యమపురి, చావు పుట్టుకలు, అంత్యేష్టి విధానము, పునర్జన్మ, రోగములు, వ్యాధులు, దానములు ఇవన్నీ తేటతెల్లముగా చెప్పబడినవి. జీవుడు ఉత్తమ జన్మలు పొందాలంటే ఏమి చేయాలి, కర్మ, జన్మ, పాపము, పుణ్యము, రోగాలు, ప్రమాదాలు ఇలా ఎన్నో ఆశక్తి కరమైన విషయములు తెలుసుకో వచ్చును. తల్లి దండ్రులు వున్న వారు ప్రేత కల్పం తప్పించి మిగతా అన్ని విషయములు, అన్ని అధ్యాయములు  అందరూ చదువ వచ్చును.
 మీ
భాస్కరానంద నాథ /14-09-2014/SRI KALAHASTHI.  

Thursday 11 September 2014

అనాయాస మరణము – ఆయాస మరణము

అనాయాస మరణము – ఆయాస మరణము

మంత్రేశ్వర ఫలదీపికాయాం – చతుర్ధశోz ధ్యాయే – శ్లోకం -21 

సౌమ్యాంశకే సౌమ్య గృహేzధ సౌమ్య సంబంధ గే వా క్షయ భేక్షయేశే
అక్లేశ జాతం మరణం నరాణాం వ్యస్తే తధా క్రూర మృతిం వదంతి.

అను ప్రమాణము వల్ల క్షయ భావము గానీ, క్షయాధిపతి గానీ సౌమ్యులయిన పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహముల సంయోగ విలోక నాధులు పొందినప్పుడు గానీ, క్షయ స్థానమున వున్నప్పుడు గానీ సునాయాస మరణము మానవులకు కలుగును.
మోక్ష స్థానమున యుక్తులుగా శుభులు యున్న ముక్తియు కలుగును. ముక్తి యందు పాపులున్నను ముక్తి విహీనుండు యిలలో ముదముగ రామా ||
ఈ విధముగా క్షయ భావ మనగా పన్నెండవ యిల్లు, ఇదియే మోక్ష స్థానము, వ్యయ స్థానము రెండునూ. ఇట్టి వ్యయాధిపతి పాపుడాయి శుభ సంయోగ విలోక నాధులు లేనప్పుడు ప్రబల పాప సంయోగ విలోకనాదులు పొందినప్పుడు దీర్ఘ కాల రోగ మరణములు, ఆయాస మరణములు, సమూహ మరణములు, అగ్ని మరణములు, జల మరణములు, ప్రబల శత్రువుల చే చిత్రవధతో కూడిన పలు విధములగు దుర్మరణములు  పాపులకు సంభవించును వారి వారి పూర్వ కర్మాను సారముగాను.
కనీసము వ్యయాధి పతి, అంశయందైనను శుభ క్షేత్ర, శుభ సంయోగములను పొందిన గాని అనాయాస మరణము కలుగదు. ప్రబల పాప స్థితి సంయోగ విలోక నాధుల చేత రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు, ఓడ ప్రమాదములు, కారు, సైకిలు ప్రమాదములు, బండ్ల ప్రమాదములు కలుగును.
జాతక చక్రము లోని దోషములను తెలుసుకొని, ఆయా గ్రహములకు శాంతి చేయించుకొని, ఇష్ట దేవతారాధన మరియు గురువును ప్రార్ధించ వలయును. గురువు ఒక్కడే అన్ని ప్రమాదముల నుంచి కాపాడ గలడు.


మీ 
శ్రీ భాస్కరానంద నాథ /12-09-2014